దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా తెలుగు చంద్రులు మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీలోని రాజకీయాలను శాసించగలమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్లు సిద్ధమయ్యారు. రాష్ట్రాలకు అధికారాలు కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముందుకు వస్తే.. బీజేపీ అంతం కోసం మహాకూటమిలో భాగంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎవరి కూటమి విజయవంతమైనా అది తెలుగు వారికి గర్వకారణమే అవుతుంది.
ముందు నుండి దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పేరున్న నేతగా చంద్రబాబు నాయుడు.. బీజేపీయేతర కూటమిలో చురుగ్గా ఉంటున్నారు. యూపీలో అఖిలేష్ యాదవ్, కర్ణాటకలో కుమారస్వామి, పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, జమ్మూకాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లాలాంటి ఎంతో మందిని ఒకే తాటిపైకి తెచ్చి వారి మద్దతుతో దూసుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అంతంత మాత్రం మెజార్టీ వస్తే మాత్రం చంద్రబాబు కూటమి కీలకం కానుంది.
మరోపక్క రాష్ట్రాల మీద కేంద్రం బోడిపెత్తనం ఏంటంటూ కేసీఆర్ ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలను కలిసిన ఆయన.. తన ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు కూడగడుతున్నారు. మొండితనం, రాజకీయ చతురత ఉన్న కేసీఆర్.. సందర్భోచితంగా వ్యవహరించి దేన్నైనా సాధిస్తారు అనే వారి మాటలో నిజం ఉంది కాబట్టి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తుతానికి అంతలా సక్సెస్ అయినట్లు కనిపించకపోయినా ముందు ముందు రాష్ట్రాల నుండి మంచి మద్దతు లభించే అవకాశముంది.
మొత్తంగా ఢిల్లీ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేసే శక్తి తెలుగు సీఎంలకు ఉందన్న మాటను అందరూ ఒప్పుకోవాల్సిందే. ‘తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా’ అనే లిరిక్ ఇప్పుడు ఇద్దరు చంద్రులకు అబ్బుతుంది. కాగా ఎవరి చంద్రకాంతి ఢిల్లీలో వెన్నెల పూయిస్తుందో ఎన్నికల్లో తేలనుంది.